70 శాతం మంది మాస్కు ధరిస్తే కొవిడ్ వ్యాప్తికి కళ్లెం!
తాజా అధ్యయనంలో వెల్లడి
సింగపూర్: కరోనా వ్యాప్తికి కళ్లెం వేయటంలో మాస్కుల ప్రాధాన్యాన్ని తాజా అధ్యయనమొకటి మరోసారి రుజువు చేసింది! కనీసం 70 శాతం మంది ప్రజలు సమర్థమైన సర్జికల్ మాస్కును స్థిరంగా ధరిస్తే కొవిడ్-19 మహమ్మారికి అడ్డుకట్ట వేయొచ్చని సింగపూర్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో మాస్కుల పాత్ర, సంబంధిత అంశాలపై నిర్వహించిన పలు అధ్యయనాలను వీరు విశ్లేషించారు. తుమ్మినపుడు, దగ్గినపుడు, మాట్లాడినపుడు నోరు, ముక్కు ద్వారా విడుదలయ్యే తుంపర్లను అడ్డుకోవడంలో మాస్కు ప్రధానంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఐదు మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం ఉండే ప్రమాదకరమైన తుంపర్లను సర్జికల్ మాస్కు ఫిల్టర్ చేయగలదని గుర్తించారు. వస్త్రంతో తయారైన మాస్కులను నిరంతరంగా ధరించడం వల్ల కూడా వైరస్ వ్యాప్తిని తగ్గించొచ్చని అధ్యయనంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్త సంజయ్ కుమార్ చెప్పారు. హైబ్రిడ్ పాలిమర్లతో తయారయ్యే మాస్కులు అత్యంత సమర్థంగా తుంపర్లను ఫిల్టర్ చేయగలవని పరిశోధకులు గుర్తించారు. ఈ మాస్కుల్లో ఫైబర్లు ఉండటం వల్ల ముఖానికి కూడా చల్లదనాన్ని అందించగలవని తేలింది. శ్వాస తీసుకునేటపుడు, వదిలేటపుడు మాస్కు నిరోధకతలో సంబంధం ఉండొచ్చని, దీనిపై మరింత పరిశోధించాల్సి ఉందని అధ్యయన కర్త ఒకరు చెప్పారు.
No comments:
Post a Comment