లాక్డౌన్లు వద్దు.. స్థానిక ఆంక్షలకు సరే.
కొత్త మార్గదర్శకాలు వెలువరించిన కేంద్ర హోంశాఖ
దిల్లీ: కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అన్లాక్-5 నిబంధనలు ఈ నెల 30వ తేదీతో ముగిసిపోతుండటంతో డిసెంబరు 1 నుంచి 31 వరకు కొత్త మార్గదర్శకాలను వెలువరించింది. ఇప్పటివరకూ తీసుకున్న చర్యల వల్ల దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిందని, తద్వారా ఒనగూరిన లాభాలను మున్ముందు కూడా కాపాడుకొనే విధంగా రాష్ట్రాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్ర హోం శాఖ బుధవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. పరిస్థితుల తీవ్రతను బట్టి కొవిడ్ వైరస్ అడ్డుకట్టకు స్థానికంగా నియంత్రణలు విధించుకోవడానికి ఉత్తర్వుల్లో వెసలుబాటు కల్పించింది. కొవిడ్ తీవ్రత నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూలాంటి ఆంక్షలను స్థానికంగా విధించుకోవచ్చని.. అయితే కంటెయిన్మెంట్ జోన్ల బయట కేంద్రంతో సంప్రదించకుండా లాక్డౌన్లు మాత్రం విధించకూడదని పేర్కొంది. కేసుల వృద్ధిపై తీవ్రంగా దృష్టి సారించి, కేంద్ర హోంశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు జారీచేసిన ప్రామాణిక నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 100 మందికి మించి గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసే బాధ్యత స్థానిక జిల్లా, పోలీసు, మున్సిపల్ అధికారులదేనని తేల్చి చెప్పింది.
మార్గదర్శకాలు ఇలా..
➤ జిల్లా యంత్రాంగాలు స్పష్టంగా కంటెయిన్మెంట్ జోన్లను గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆ జోన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లలో వెల్లడించాలి.
➤ కంటెయిన్మెంట్ జోన్ల నుంచి రాకపోకలు జరగకుండా నిఘా ఉంచాలి.
➤ ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధి లక్షణాలున్న వారిపై నిఘా పెట్టాలి. పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వ్యక్తుల కాంటాక్ట్ జాబితాను రూపొందించి, అందులో కనీసం 80% మందినైనా 72 గంటల్లోపు గుర్తించి 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలి.
➤ బాధితులకు ఇంటిదగ్గరే హోం ఐసోలేషన్ నిబంధనల ప్రకారం వైద్యసేవలు అందించాలి.
➤ అందరూ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలను అనుసరించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
➤ బహిరంగ స్థలాలు, పనిచేసే చోట్ల మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలి.
మిగిలిన ప్రాంతాల్లో వీటికి అనుమతి
➤ కంటెయిన్మెంట్ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని చోట్ల ఈ కింద పేర్కొన్న కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
➤ కేంద్రహోంశాఖ అనుమతిచ్చిన మేరకు అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు.
➤ 50% సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియేటర్లు, క్రీడాకారుల శిక్షణా కార్యక్రమాల కోసం ఈతకొలనులు నిర్వహించుకోవచ్చు.
➤ వ్యాపారుల కోసం (బిజినెస్ టు బిజినెస్) ఎగ్జిబిషన్ హాల్స్ తెరవొచ్చు.
➤ 50% హాల్ సామర్థ్యంతో సామాజిక, మత, క్రీడా, వినోద, విద్య సమావేశాలు నిర్వహించుకోవచ్చు. నాలుగు గోడల మధ్య అయితే గరిష్ఠంగా ఈ సంఖ్య 200కి మించరాదు. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు నాలుగు గోడల మధ్య గుమికూడే వారి సంఖ్యను 100కి పరిమితం చేయొచ్చు.
రాష్ట్రాలు చేయాల్సిన అంశాలు
➤ రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూలాంటి ఆంక్షలను స్థానికంగా విధించుకోవచ్చు. అయితే కంటెయిన్మెంట్ జోన్ల బయట కేంద్ర ప్రభుత్వంతో ముందుగా సంప్రదించకుండా రాష్ట్ర, జిల్లా, సబ్డివిజన్, నగర స్థాయుల్లో లాక్డౌన్లు మాత్రం విధించకూడదు.
➤వారంలో 10%కి మించి పాజిటివిటీ రేట్ ఉన్న నగరాల్లో ఆఫీసు పనివేళలు దశలవారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
➤రాష్ట్రంలో అంతర్గతంగా కానీ, రాష్ట్రాల మధ్యకానీ వ్యక్తులు, సరుకు రవాణాపై ఆంక్షలు విధించకూడదు. సరిహద్దు దేశాలతో రవాణా ఒప్పందాలు ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ ఎలాంటి ఆంక్షలు అమలు చేయకూడదు.
➤65ఏళ్ల పైబడినవారు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు అత్యవసరాలు, ఆరోగ్య సమస్యల విషయంలో తప్పితే మిగిలిన సమయాల్లో ఇంటికే పరిమితం కావాలి.
No comments:
Post a Comment