- కొవిడ్.. కొత్తగా !
- లక్షణాల్లో తలనొప్పి.. ఒళ్లు, కీళ్లనొప్పులు
- నీరసం అనిపించినా.. పరీక్షల్లో పాజిటివ్
- కనుగుడ్డు నుంచీ శరీరంలోకి వెళ్తున్న వైరస్
కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షించినప్పుడు కూడా పాజిటివ్ వస్తోందని చెబుతున్నారు. కనుగుడ్డు నుంచి సైతం వైరస్ శరీరంలోనికి చేరుతోందని, అలాంటి వారిలో కళ్లు ఎర్రబడుతున్నాయని పేర్కొంటున్నారు. గుంటూరుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి నాలుగు రోజుల కిందట జ్వరం వచ్చి తగ్గింది. ఒళ్లు నొప్పులు తగ్గడంలేదని, అనుమానంతో పరీక్ష చేయించగా పాజిటివ్గా తేలింది. అందుకే ఒళ్లు, కీళ్ల నొప్పుల విషయంలో అశ్రద్ధ చేయొద్దని సీనియర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో విరేచనాలు ఉన్నా... ఉపేక్షించవద్దని, వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంటున్నారు.
మూడు జిల్లాల్లో కేసుల పరిశీలన
వైరస్... తొలి, మలి దశ బాధితుల్లో కనిపించిన అనుమానిత లక్షణాలపై గుంటూరు, విజయవాడ, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసులను పరిశీలించారు. ఒళ్లు, కీళ్ల నొప్పులతో వచ్చిన వారికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోందని, ఈ తరహా లక్షణాలు ఈసారి ఎక్కువ మందిలో కనిపించినట్లు ప్రభుత్వ వైద్య నిపుణుల కమిటీ ముఖ్య ప్రతినిధి డాక్టర్ సుధాకర్ తెలిపారు.
బాధితుల్లో యువకులే అధికం
గతంలో కంటే... ఈసారి యువతే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం ఇందుకు ఎక్కువ కారణాలుగా కనిపిస్తున్నాయి. తొలిదశలో 40-45 సంవత్సరాల మధ్యన ఉన్న వారు అధికంగా కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం 20-35 ఏళ్లలోపు వారికి ఎక్కువగా కరోనా సోకుతోందని వైద్యులు తెలిపారు. గత నెల రోజుల్లో నమోదైన కేసుల్లో 20-25% మంది యువతేనని ఓ అంచనా.
లక్షణాలు కనిపిస్తున్నా నిర్లక్ష్యమే
లక్షణాలు కనిపిస్తున్నా... యువకులు కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణితో కుటుంబంలో రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులున్న పెద్దలకు వైరస్ త్వరగా సోకుతోంది. వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇంటర్, ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉపాధి, ఉద్యోగాల కోసం బయట తిరిగే యువకులు వైరస్ బారిన పడుతున్నారు.
ఏకకాలంలో ఎక్కువ కేసులు
వైరస్ తొలి దశలో కంటే ప్రస్తుతం చురుగ్గా వ్యాపిస్తోందని ప్రధాన కొవిడ్ ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. గతంలో ఒకేసారి రెండు, మూడు కేసులు మాత్రమే వచ్చేవన్నారు. ప్రస్తుతం ఒకేసారి 10, 15 కేసులు వస్తున్నాయన్నారు. అయితే... బాధితులకు అందించే చికిత్స, పరీక్షలు, మందులు ఇవ్వడంలో ఎలాంటి మార్పు లేదన్నారు. కిందటేడాది మాదిరిగానే చికిత్స అందించిన అనంతరం కోలుకుంటున్నారని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
2, 3 రోజులకే పాజిటివ్
ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందేందుకు గతంలో అయిదు నుంచి ఏడు రోజుల వరకు పట్టేది. ఇప్పుడు రెండు, మూడు రోజులకే అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నాయని, పరీక్ష చేయిస్తే పాజిటివ్ వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే... అనవసర ప్రయాణాలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
No comments:
Post a Comment