Vaccine: 18+ వారికీ ఆన్సైట్ రిజిస్ట్రేషన్
➤దిల్లీ: టీకా పంపిణీపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసు గల వారు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండానే ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్సైట్ లేదా వాక్-ఇన్ (అప్పటికప్పుడు) రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా వేయించుకునేందుకు వీలు కల్పించింది. టీకా వృథాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.
➤టీకాల కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులు ఒకవేళ ఆ రోజున రాకపోతే ఆ టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి. అందుకే టీకా వృథాను కొంతలో కొంత తగ్గించేందుకు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద 18-44 ఏళ్ల వారికి ఆన్సైట్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తున్నాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి, మొబైల్ ఫోన్స్ వాడకం తెలియనివారికి కూడా ఆన్సైట్ నమోదుకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది.
➤అయితే దీనిపై తుది నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ 18-44 ఏళ్ల వారికి ఆయా రాష్ట్రాలు ఆన్సైట్ రిజిస్ట్రేషన్కు అనుమతినిస్తే.. అది కేవలం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ప్రయివేటు కేంద్రాల వద్ద వాక్-ఇన్ నమోదులను చేపట్టొద్దని సూచించింది. అంతేగాక, ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సమయంలో టీకా కేంద్రాల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.
No comments:
Post a Comment