- కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపుతో నష్టం లేదు
- డెల్టాపై కొవిషీల్డ్ ఒక డోసు ప్రభావం 61%
- పరిస్థితులు మారితేనే తగ్గిస్తాం
- ఎన్టీఏజీఐ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా
దిల్లీ: కొవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12-16 వారాలకు పెంచాలన్న నిర్ణయం పూర్తి శాస్త్రీయంగా, ఏకాభిప్రాయంతో తీసుకున్నదని.... దీనిపై ఎలాంటి భిన్నాభిప్రాయం వ్యక్తం కాలేదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టాగీ) ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా మంగళవారం ప్రకటించారు. మన దేశంలో... డెల్టా రకం వైరస్పై కొవిషీల్డ్ ఒకడోసు 61 శాతం; రెండు డోసులు 65 శాతం ప్రభావం చూపుతున్నాయన్నారు. రెండు డోసుల ప్రభావం మధ్య పెద్దగా తేడా లేదని, అందువల్ల డోసుల వ్యవధి పెంచడం వల్ల నష్టం లేదని వివరించారు. కరోనా నిరంతరం మారుతూ ఉంటుందని, అందువల్ల రేప్పొద్దున వచ్చిన అధ్యయనాల్లో గ్యాప్ను తగ్గించాలని, దానివల్ల 5-10% మందికి ఎక్కువగా మేలు జరుగుతుందని తేలినా తాము ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారుతాయని డాక్టర్ అరోడా తెలిపారు. కొవిషీల్డ్ డోసుల మధ్య గడువు తగ్గించాలన్న వాదనల నేపథ్యంలో మంగళవారం ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.*
మన అధ్యయనాల ప్రకారం...
‘‘ఎడినో వెక్టార్డ్ (ఎడినో వైరస్ను వాహకంగా వాడే) వ్యాక్సిన్లు విభిన్న దేశాల్లో విభిన్నంగా పనిచేస్తాయి. బ్రిటన్లో కనిపించిన ఫలితాల ఆధారంగా కొవిషీల్డ్ గ్యాప్ను తొలుత పెంచాం. అయితే మన పీజీఐఎంఈఆర్ చండీగఢ్, సీఎంసీ వెల్లూరులోని వైద్యసిబ్బందిపై వచ్చిన రెండు వేర్వేరు అధ్యయనాల్లో ఒక్క డోసు కూడా మంచి ప్రభావం చూపింది. చండీగఢ్లో వైద్య ఆరోగ్య సిబ్బందిపై జరిపిన అధ్యయనంలో ఒక డోసు ఇచ్చినవారిపైనా, రెండు డోసులు ఇచ్చిన వారిపైనా కొవిషీల్డ్ ప్రభావం 75% మేర కనిపించింది. రెండు డోసుల మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నప్పటికీ ఒక డోసుతో రక్షణ లభిస్తుందని దీని ద్వారా తేలింది. చండీగఢ్లో అల్ఫా రకంపై అధ్యయనం జరిగితే, నాలుగు రోజుల తర్వాత సీఎంసీ వెల్లూరు అధ్యయనంలో డెల్టా రకంపై వ్యాక్సిన్ ప్రభావం గురించి పరిశోధించారు. ఇందులో ఒక డోస్ కొవిషీల్డ్ తీసుకున్నవారిపై 61%, రెండు డోసులు తీసుకున్నవారిపై 65% ప్రభావం చూపుతున్నట్లు తేలింది. రెండు డోసుల మధ్య పెద్ద తేడా లేదని వెల్లడైంది. ఎడినో వెక్టార్డ్ వ్యాక్సిన్లను స్వల్ప సమయ తేడాతో ఇచ్చినప్పుడు స్పందన సరిగా ఉండదు. గ్యాప్ ఇచ్చినప్పుడు మంచి ఫలితం ఉంటుంది. భారత్లో గ్యాప్ పెంచడానికి అదో ప్రధాన కారణం.
అవసరమైతే మారుస్తాం
ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలేమీ శాశ్వతం కాదు. కరోనా నిరంతరం మార్పు సంతరించుకుంటూ ఉంటుంది. అందువల్ల వ్యాక్సినేషన్ కూడా అంతే డైనమిక్గా ఉంటుంది. రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించడం మేలనీ... దానివల్ల 5-10% మందికి ప్రయోజనం చేకూరుతుందన్నా కమిటీ తన విచక్షణ మేరకు ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ప్రస్తుత నిర్ణయం సరిగా ఉందని తేలితే అదే కొనసాగిస్తాం. అంతిమంగా ప్రజలకు రక్షణే కీలకం. అదే వ్యాక్సినేషన్కు ఆధారం’’ అని డాక్టర్ అరోడా స్పష్టంచేశారు.
No comments:
Post a Comment