వృక్షాలకు పింఛన్లు!
- 75 ఏళ్లు దాటిన వాటికి ఏడాదికి రూ.2500
- హరియాణాలో కొత్త పథకం
చండీగఢ్: మనుషులకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందజేయడంతో పాటు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న వృక్షాలకు హరియాణా ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో 75 ఏళ్లు, ఆపై వయసున్న వృక్షాలను గుర్తించి వాటికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. జీవిత కాలమంతా మానవాళికి చేస్తున్న సేవలకు ప్రతిగా వాటికి గౌరవ భృతిని కల్పించాలని సంకల్పించింది. ‘ప్రాణ వాయు దేవత పింఛను పథకం’ పేరుతో 75 ఏళ్లు దాటిన ప్రతి వృక్షానికి ఏడాదికి రూ.2500 చొప్పున ఇవ్వనుంది. అంతేకాకుండా వాటికి ‘వారసత్వ హోదా’ కల్పించనుంది. పింఛను మొత్తాన్ని ప్రతియేటా పెంచుకుంటూ వెళ్తామని మనోహర్లాల్ ఖట్టర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం హరియాణాలో 75 ఏళ్లు దాటిన వృక్షాలు 2500 వరకు ఉండవచ్చని ఆ రాష్ట్ర అటవీశాఖ అంచనా వేస్తుంది. వృక్ష దేవతల గుర్తింపు, పరిరక్షణలకు అనుసరించాల్సిన విధివిధానాలను, నిబంధనలను అటవీశాఖ సిద్ధం చేస్తుంది. ఆక్సిజన్ వనాల ఏర్పాటు యోచనలోనూ హరియాణా ప్రభుత్వం ఉంది. 100 ఎకరాల చొప్పున స్థలాలను ఎంపిక చేసి అక్కడ వివిధ రకాల మొక్కలను పెంచి ఆయా వనాలకు సుగంధ వనం, ధ్యాన వనం, ఆరోగ్య వనం వంటి పేర్లను పెట్టనుంది. వివిధ ప్రాంతాల్లో ఈ వనాలను ఏర్పాటు చేయనుంది.
పింఛను ఎలా ఇస్తారు ?
➧వృక్షాలకు పింఛను ఎలా అందజేస్తారు అన్న ప్రశ్నకు హరియాణా అధికారుల సమాధానం ఇదీ...
➧ప్రైవేటు వ్యక్తుల స్థలంలో 75 ఏళ్లు పైబడిన వృక్షం ఉన్నట్లయితే...ఆ వ్యక్తిని యజమానిగా గుర్తించి ఏడాది కోసారి వృక్ష పింఛను అందిస్తుంది.
➧పంచాయతీ/స్థానిక సంస్థల స్థలంలో ఉంటే సర్పంచి/ఛైర్మన్ను ఆ వృక్షాల సంరక్షకునిగా గుర్తిస్తారు.
➧విద్యా సంస్థల ఆవరణలో ఉంటే ప్రిన్సిపల్, ఇతర సంస్థలైతే వాటి ప్రధాన అధికారికి పింఛను అందజేస్తారు. అటవీ ప్రాంతంలో ఉంటే అటవీ అధికారికి ఆ మొత్తాన్ని ఇస్తారు.
ఎలా ఖర్చు చేస్తారంటే..
➧ప్రాణవాయు దేవత పింఛను అందుకున్న వ్యక్తి ఆ వృక్షం విశిష్టతను వివరిస్తూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలి.
➧వృక్షం ఉన్న ప్రాంతాన్ని సుందరంగా ఉంచి, రక్షణగా కంచె ఏర్పాటు చేయాలి.
➧చెట్టు కింద నీడలో ప్రజలు కూర్చోవటానికి ఏర్పాట్లు చేయాలి.
➧తెగుళ్లు, చీడలు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలి.
No comments:
Post a Comment