దేశ జనాభా 134 కోట్లు
- ఏడాదిలో 83 లక్షల మరణాలు, 2.67 కోట్ల జననాలు
- తెలంగాణ జనాభా 3.72 కోట్లు, ఏపీలో 5.23 కోట్లు
- 2019 గణాంకాలను విడుదల చేసిన జన గణన విభాగం
దేశ జనాభా అప్రతిహతంగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం 133.89 కోట్లకు చేరింది. కన్నుతెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం అన్నట్లుగా దేశంలో జనన, మరణాలు పెరిగిపోతున్నాయి. నిమిషానికి సగటు 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది కన్నుమూస్తున్నారు. మొత్తంమీద నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన (రిజిస్టర్డ్) జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా తాజా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది.
ఏడాది (2019) వ్యవధిలో దేశంలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా మరణాలు 83 లక్షలున్నాయి.
➧దేశంలో నమోదైన జననాల్లో 81.2 శాతం ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగాయి.
➧మొత్తం 83.01 లక్షల మరణాల్లో 34.5 శాతం మందికి మరణించే సమయంలో ఎలాంటి వైద్య సదుపాయం అందలేదు. ఇవన్నీ సహజ మరణాలుగా నమోదయ్యాయి. ఆసుపత్రుల్లో చేరి వైద్యం పొందుతూ సంభవించిన మరణాలు 32.1 శాతమున్నాయి. ఇతర కారణాలతో మిగతా మరణాలు వాటిల్లాయి.
➧పుట్టిన వెంటనే కన్నుమూసిన శిశు మరణాలు 1,65,257 కాగా ఇందులో 75.5 శాతం పట్టణాల్లో, మిగిలిన 24.5 శాతం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి.
20 ఏళ్లలో 118 శాతం పెరుగుదల
దేశంలో జనన, మరణాల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. కేవలం 20 సంవత్సరాల వ్యవధిలోనే 118 శాతం అదనంగా జననాలు పెరిగాయి. ఉదాహరణకు 1999లో దేశంలో 1.22 కోట్ల మంది పుడితే 2019 సంవత్సరంలో అంతకన్నా మరో 118 అదనంగా పెరిగి 2.67 కోట్ల మంది పుట్టడం గమనార్హం. ఇదే కాలవ్యవధిలో మరణాలు ఏకంగా 129 శాతం పెరిగి 36.23 లక్షల నుంచి 83 లక్షలకు చేరడం గమనార్హం.
No comments:
Post a Comment