సరి–బేసిలో స్కూల్స్
విద్యా శాఖ ప్రతిపాదన.. నేడు వెలువడనున్న నిర్ణయం
23న 6,8,10 తరగతులు, 24న 7,9 తరగతులు
తరగతి గదికి 16 మంది విద్యార్థులే కొలమానం
➤ సరి–బేసి విధానంలో సోమవారం నుంచి ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు స్కూల్స్ నిర్వహించాలని విద్యా శాఖ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులను ప్రారంభించగా విద్యార్థుల హాజరు క్రమేణా పెరుగుతోంది. పాఠశాలల వారీగా తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య, తదితర వివరాలతోపాటు సరి–బేసిపైనా హెచ్ఎంల నుంచి సూచనలు స్వీకరించినట్లు సమాచారం. పాఠశాలలు, తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని స్థానిక పరిస్థితులను బట్టి ఇకపై రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోవున్న పాఠశాలల్లో కొన్ని తరగతులను రోజు విడిచి రోజు (సరి–బేసి విధానం) నిర్వహించే వెసులుబాటును హెచ్ఎంలకే అప్పగించనున్నారు. తరగతి గదికి 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలన్న ప్రాథమిక నియమం విధిం చనున్నారు. విద్యా శాఖ నుంచి అధికారికంగా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
తరగతుల నిర్వహణ ఇలా..
➤ప్రస్తుతం 9, 10 తరగతులకు జిల్లాలో 1,06,651 మంది విద్యార్థులు, 6, 7, 8 తరగతులకు 1,58,976 మంది వెరసి.. మొత్తం మీద 2,65,627 మంది ఉన్నారు.
➤ సరి – బేసి విధానం ప్రకారం తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ఈ నెల 23 న 6, 8, 10 తరగతులు, 24న 7, 9 తరగతులు ప్రారంభిస్తారు. ఆ తదుపరి ఇదే క్రమంలో తరగతులు ఉంటాయి.
➤ఉదాహరణకు 6, 8, 10 తరగతుల విద్యార్థులు మొత్తం 400 మంది ఉంటే తరగతికి 16 మంది చొప్పున పాఠశాలలో మొత్తం 25 తరగతి గదులు ఉంటే అనుమతిస్తారు.
➤ తరగతికి 16 మంది విద్యార్థుల చొప్పున లెక్కించి నిర్వహించదలచిన తరగతులకు సరిపడినన్ని గదులు లేని సందర్భంలో అలా మిగిలిన విద్యార్థులకు మూడో రోజున తరగతులు ఉంటాయి.
➤7, 9 తరగతులకు సంబంధించి మొత్తం విద్యార్థులను రెండు భాగాలుగా విభజించి ఒక్కో తరగతికి సగం మంది విద్యార్థులకు ఉదయం, మిగతా సగం మందికి మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహిస్తారు.
➤ ఉదయం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు పెట్టి ఇళ్ళకు పంపిస్తారు. మధ్యాహ్నం పూట తరగతులకు వచ్చే విద్యార్థులకు స్కూలులో మధ్యాహ్న భోజనం పెట్టిన తరువాత తరగతులు నిర్వహిస్తారు.
➤ 9, 10 తరగతులకు విద్యార్థుల హాజరు సగటున 36 శాతం మాత్రమే ఉన్నందున, సోమవారం నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభించినప్పటికీ అదే స్థాయిలో హాజరు ఉంటుందని, అందువల్ల పాఠశాలల్లో సరి–బేసి విధానంలో తరగతుల నిర్వహణకు గదుల కొరత ఏర్పడకపోవచ్చునని విద్యాశాఖ భావిస్తోంది.
➤ విద్యార్థుల సంఖ్య భారీగా వున్న పాఠశాలలు 20 శాతంలోపు మాత్రమే ఉంటాయని, ఆ మేరకు తరగతులకు ఇబ్బందులు ఉండవని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
No comments:
Post a Comment